నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, పోలీసుల ద్వారా చేయించిన భౌతిక దాడులను నిరసిస్తూ నిజామాబాద్ నూతన కలెక్టరేట్ వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీల అమలును కోరుతూ నల్ల టీషర్టులు ధరించి శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. నర్సాపూర్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, మహిళల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు , జగదీష్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను కిందపడేసి, తొక్కి, తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధిపై జరిగిన దాడికి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిపిన భౌతిక దాడులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేసి గద్దె దిగాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, నిరంకుశ పాలన సాగిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బిఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
