నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 8,9,10 తేదీల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తా మహానగరంలో జరిగే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFI ) రజతోత్సవ మహాసభలకు టీఎస్ యూటీఎఫ్(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్ హాజరయ్యారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఓ.రమేష్, జి.గంగాధర్ తెలిపారు. ఈ రజతోత్సవ మహాసభల్లో “జాతీయ విద్యా విధానం -2020, సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్దరించాలని, మధ్యాహ్న భోజన స్లాబ్ రేట్స్ పెంచాలని, విద్యార్థులకు సరిపడా అన్ని రకాల స్టేషనరీ అందించాలని, ఉద్యోగుల ఇన్ కం టాక్స్ స్లాబ్ రేట్స్ పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి భౌతిక వసతులు కల్పించాలని, స్మాట్ క్లాస్ రూం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులను భోధనేతర విధుల నుండి

మినహాయించాలని,విద్యా రంగానికి బడ్జెట్ ని కనీసం జీడీపీ లో 6 శాతం, కేంద్ర బడ్జెట్ లో కనీసం 10 శాతం, రాష్ట్రాల బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలని, సావిత్రి బాయి పూలే జయంతి జనవరి 3ను జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని, టీచర్ – స్టూడెంట్ నిష్పత్తిని ప్రీ ప్రైమరీ 1:10, ప్రైమరీ స్కూల్ 1:20, అప్పర్ ప్రైమరీ స్కూల్ 1:25, హై స్కూల్ 1:30, హయ్యర్ సెకండరీ స్కూల్ 1:35 గా ఉండాలనే అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎస్టీఎఫ్ఐ మహాసభలు జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతాయని తెలిపారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలను కూలంకషంగా చర్చించి విద్యారంగానికి ఉపయోగపడే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం జరుగుతుందని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుండి సుమారుగా 37 మంది ప్రతినిధులు హాజరుకాగా నిజామాబాద్ జిల్లా నుండి డి. సత్యానంద్ హాజరయ్యారని తెలిపారు. 2022 సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ లో జరిగిన ఎస్టీఎఫ్ఐ జాతీయ మహాసభల్లో కూడా సత్యానంద్ పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ సత్యానంద్ కి అభినందనలు తెలిపింది.
