నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మొత్తం 30 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్, ప్రతి సమస్యను చట్టపరంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలకు సూచించారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరించేందుకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, పైరవీలకు తావులేకుండా నేరుగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించడం, పోలీస్ శాఖపై ప్రజలకు మరింత నమ్మకం పెంపొందించడం, శాంతి భద్రతలను పరిరక్షించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

