- మాజీ ఎంపీటీసీ కర్రేవార్ రాములు
మద్నూర్, బతుకమ్మ: ఓటర్ లిస్ట్ లలో తప్పుల తడాఖా భారీగా కనిపిస్తుందని ఇలాంటి తప్పులను సవరించాలని మద్నూర్ మాజీ ఎంపీటీసీ కర్రేవార్ రాములు ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ లిస్టులో తప్పుల గురించి మాట్లాడారు. కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఓటర్ సవరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పిస్తూ అలాగే ఎన్నికల ముందు చనిపోయిన వారి పేర్లు తొలగించాలని అన్నారు. డబుల్ పేర్లు రాకుండా చర్యలు చేపట్టాలని, ఎన్నికల కమిషనర్లు ఆదేశించడం జరుగుతుందని వివరించారు. ఎన్నికల కమిషనర్ల ఆదేశాలు ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 7000 పైచిలుకు ఓటర్లు ఉన్నట్లు చూపిస్తున్నాయని, మండల కేంద్రంలో మొత్తం 14 వార్డులు ఉండగా ఏ వార్డులో చూసినా తప్పుల తడాఖా భారీగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఒక్కొక్క వార్డులో ఒక్కొక్కరి పేరు రెండుసార్లు మూడుసార్లు నాలుగు సార్లు ఉన్నట్లు చూపించారు. చనిపోయిన వారి పేర్లు అసలే తొలగించలేదని, ఒక్కొక్కరి పేరు రెండు వార్డుల్లో డబుల్ వచ్చాయని పెండ్లి చేసుకుని ఇతర గ్రామాలకు వెళ్లిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుండి తొలగించలేదని వివరించారు. ఇలాంటి తప్పులు ఎన్నికల అధికారులు స్థానిక సంస్థలు ఎన్నికల కంటే ముందుగానే సవరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
