- ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసన మండలిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని, రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 4 లక్షల 42 వేలు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ 8 లక్షల కోట్లు అప్పులు చేశామని దష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలు చెబుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతాయన్నదానిలో వాస్తవం లేదని స్వయంగా ఇరిగేషన్ మంత్రి మండలిలో చెప్పారని అన్నారు.

నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కాదా ? అని ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాకుంభమేళ తరహాలో రజతోత్సవ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాసన మండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు. సమన్వయంతో అన్ని అవకాశాలను వాడుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని తెలిపారు. ప్రజలు, రైతులు, మహిళలు వంటి అన్ని సమస్యలపై గళమెత్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రతీ రోజూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపామన్నారు. కేసీఆర్ పై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా సభలో నిరసన తెలిపామని తెలిపారు. ఫీజు రియింబర్స్ మెంట్ పై మేము చేసిన పోరాటానికి దిగొచ్చిందని అన్నారు. ఎప్పటికప్పుడు ఫీజు రియింబర్స్ మెంట్ నిధులను విడుదల చేస్తామని మండలి సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. ఈ ప్రకటన అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయన్నారు. ఆ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృష్టి ఫలితం ఎంతో ఉందని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్ధేశించి పరుషపదజాలంతో ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడారని, ముఖ్యమంత్రి చరిత్రలో వ్యాఖ్యలు నల్ల మరకగా ఉండిపోయిందని అన్నారు.

