- ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.శరత్
కామారెడ్డి, బతుకమ్మ : సామాజిక,ఆర్థిక,విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటి సమగ్ర సర్వేను వేగంగా పూర్తి సమాచారం సేకరించాలని, సర్వే లో ఆయా కుటుంబాలు అందించే వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సమాచారం ఉంటేనే అభివృద్ధి ప్రణాళికలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతీ టీమ్ రోజుకు కనీసం 15 గృహాలను సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో సర్వే కోసం ఏర్పాటుచేసిన ఎన్యుమరెటర్స్, సూపర్వైజర్ ల వివరాలను అంతకుముందు కలెక్టర్ వివరించారు. క్షేత్ర స్థాయిలో సమిష్టిగా పనిచేయడం ద్వారా పనులు వేగంగా పూర్తవుతాయని అన్నారు. సర్వేతో పాటు ఆన్లైన్ ఎంట్రీలు కూడా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ప్రతీ చోట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అంతే కాకుండా సన్న వడ్లు కొనుగోలుకు ప్రత్యేక సెంటర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించడంతో పాటు ట్యాబ్ ఎంట్రీలు చేయడం ద్వారా ప్రగతి కనబడుతుందని అన్నారు. సెంటర్ లో కొనుగోళ్లు చేసిన ధాన్యం ను వెంటదివెంట మిల్లులకు రవాణా చేసేందుకు లారీ ట్రాన్స్ పోర్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించి తెలియజేయాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు రైస్ మిల్లర్లకు సహకరించాలని సూచించారు. రైతులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అన్నారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోళ్లు చేపడుతున్నదని తెలిపారు. మండల స్థాయిల్లో తహసీల్దార్లు సెంటర్లను సందర్శించాలని సూచించారు. తొలుత జిల్లాలో కొనుగోలు చేస్తున్న ధాన్యం పంట వివరాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివరిస్తూ, జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో సన్న రకం వడ్లు కొనుగోలుకు 67 సెంటర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 4466 మంది రైతుల నుండి 30629 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, లారీల్లో ఆయా రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ ఎంట్రీ జరుగుతున్నదని తెలిపారు. గోనె సంచులు, ట్రాన్స్పోర్టేషన్, మిల్లర్ల బ్యాంక్ గ్యారంటీ, రైతులకు చెల్లింపులు, తదితర అంశాలపై వివరించారు. అంతకుముందు కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి సందర్శించారు. రైతులతో ఆయన మాట్లాడారు, రైతులు పంటను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఇంటింటి సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ తీరును ప్రత్యేక అధికారి, కలెక్టర్ లు సందర్శించి, స్టిక్కర్ పై నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహాయ పౌరసరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని రజిత, స్థానిక తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, ఇతర అధికారులు, రైతులు , తదితరులు పాల్గొన్నారు.

