- ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్న సీఎం
హైదరాబాద్, బతుకమ్మ : అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన కారణాలను తెలుసుకున్నారు. మంగళవారం సెక్రటేరియట్ లో మధుయాష్కీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న సీఎం వెంటనే స్పందించి ఏఐజీ ఆస్పత్రిలో చేరేంత వరకు వారి సిబ్బంది, అధికారులకు సూచనలు చేసి మానిటరింగ్ చేశారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తోనూ సీఎం మాట్లాడి.. మధుయాష్కీ కు అందిస్తున్న చికిత్స పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. ఈ క్రమంలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మధుయాష్కికి అన్ని రకాల పరీక్షలను నిర్వహించి చికిత్సను అందించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి.. పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కి మధుయాష్కి కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాజకీయ ప్రముఖులు ఫోన్లో పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పి. వినయ్ కుమార్, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజమతుల్లా, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, పలువురు నాయకులు పరామర్శించారు.
