హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారి తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త శ్రీ కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) మృతికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తుడు, తమిళ భాషా ప్రేమికుడు, అనంతన్ గారిని కోల్పోవడం ఎంతో బాధాకరం అని పేర్కొన్నారు. కుమారి అనంతన్ గారు నాలుగుసార్లు శాసనసభకు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న తమిళ సైతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.