నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్రీయ విద్యాలయ బోయిన్ పల్లి క్లస్టర్ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్ వేదికైంది. ఈనెల 12,13 తేదీల్లో “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్” , “ఏక్తా పర్వం” నిర్వహించబడుతుంది. గానం, నృత్యం, వాయిద్య సంగీతం, నాటకం, సాంప్రదాయక కథనం వంటి ప్రదర్శన కళలతో పాటు చిత్రలేఖనం, శిల్పనం వంటి కళల నందు పోటీలు నిర్వహించబడుతాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల మధ్య పోటీతత్వం ఏర్పడుతుందన్నారు.

కేంద్రీయ విద్యాలయాలు చదువుతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులు కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ విభాగం స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధిస్తారని నిర్వాహకులు తెలియజేసారు. ఈ క్లస్టర్ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలలో కేంద్రీయ విద్యాలయం బేగంపేట్, బోయిన్ పల్లి, బార్కాస్, శివరాంపల్లి, జరసంఘం, అదిలాబాద్, బోధన్, కంచన్ బాగ్, నిజామాబాద్ కు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కేవీ నిజామాబాద్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ రావు, జ్ఞాన సరస్వతి సంగీత కళాశాల ప్రిన్సిపల్ “రవీంద్ర రాజు” తో పాటు వివిధ కళా రంగాల నుంచి విచ్చేసిన న్యాయ నిర్ణేతలు, వివిధ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన అధ్యాపకులు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

