నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్లకు వేతనాల పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ, పని భారం తగ్గింపుకై ఈనెల 22న ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) ఆధ్వర్యంలో జరిగే “ఛలో ఎస్పీడీ ఆఫీస్ ” కార్యక్రమం పోస్టర్లను నిజామాబాద్ సౌత్, నార్త్ కేజీబీవీ ల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్లకు కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదన్నారు. పని భారం విపరీతంగా పెరిగిందన్నారు. రిటైర్ అయిన కార్మికులకు గ్రాట్యూటీ చెల్లింపులు లేవన్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే, సిబ్బంది సంఖ్య తగ్గుతుంధని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలుగా అప్ గ్రేడ్ ఐన, కొత్తగా మంజూరైన కేజీబీవీలకు తగిన సిబ్బందిని నియమించలేదన్నారు. డ్యూటీ చార్ట్, వీక్లీ ఆఫ్ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఒకవైపు ధరలు పెరుగుతుంటే, వేతనాలు పెరగక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పని భారం విపరీతంగా పెరిగి కేజీబీవీ వర్కర్లు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా నాన్ టీచింగ్ వర్కర్లకు వేతనాలు ₹26వేలకు పెంచాలని, పని భారం తగ్గించాలని ఖాళీ పోస్టులను, భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్, వర్కర్లకు నైట్ డ్యూటీ లను రద్దు చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ని అమలు చేయాలని, రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాడ్యుటీని చెల్లించాలన్నారు. అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదన్నారు. వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరం కోసం ఈనెల 22న హైదరాబాదులోని స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల నాన్ టీచింగ్ వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

