. . . బస్సాపూర్ గ్రామంలో 18 సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ
బాల్కొండ, బతుకమ్మ :
నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బుధవారం బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 18 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బస్సాపూర్ గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్త లు తీసుకోవాలని అన్నారు. పంటపొలాలలో ఎవరు కూడా మంటలు పెట్టారాదని, అందుకోసం మల్టీ పోటాషియం మందులు వాడినట్టుయితే భూ సాంద్రత బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎ.సి.పి. జె.వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సి.ఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్.ఐ శైలందర్, బస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ శ్రీరాంపూర్ సర్పంచ్ ఎర్రన్న, గ్రామ అభివృద్ధి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

