. . . కాలువలోకి పల్టీ కొట్టడంతో ప్రమాదం
. . . ఘటన స్థలాన్ని సీపీ సందర్శన
డిచ్ పల్లి, బతుకమ్మ :
నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున కారు బోల్తా పడి కాలువలోకి పల్టీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్ ఇటుకల బట్టి వ్యాపారస్తుల వద్ద పని చేస్తున్నారు. కార్మికులు నాందేడ్ కు ఫ్యామిలీ విషయం మాట్లాడడం కోసం వెళ్లి తిరిగి ప్రయాణం అవుతున్న సందర్భంలో గురువారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు ప్రాంతంలో గల మారుతి ఈకో టి.ఎస్ 17 కె 0762 గల వాహనమును కారు డ్రైవర్ అతివేగముగా అజాగ్రత్తగా నడపడం వలన కెనాల్ పై నుంచి క్రిందపడి మూడు పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు మామూలు గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని సీపీ పి. సాయి చైతన్య పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగముగా అజాగ్రత్తగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని , ముఖ్యంగా బైపాస్ రోడ్డులో అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు.సీపీ వెంట డిచ్ పల్లి ఎస్సై ఎండి ఆరిఫ్ , నిజామాబాద్ రూరల్ ఎస్ హె చ్ఓ శ్రీనివాస్ తదితరులున్నారు.

