నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగర శివారులోని అశోక్ సాగర్ లో తల్లికూతుళ్ళ మృతదేహాలు వెలుగుచూసిన సంఘటన మంగళవారం జరిగింది. అశోక్ సాగర్ లో ఒక మహిళ, చిన్నారి డెడ్ బాడిలు నీటిలో తేలాయని ఎడపల్లి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీయగా చనిపోయిన ఇద్దరు నిజామాబాద్ నగరంలోని హస్మీకాలనీకి చెందిన ఇమ్రానీ బేగం(32), నేహా (4) లుగా గుర్తించారు. కాలనీ నుంచి పని ఉందని బయటకు వెళ్లి తల్లికూతుళ్ళు అశోక్ సాగర్ లో శవాలై తేలడంపై అందరూ షాక్ కు గురయ్యారు. ఈ విషయం సాయంత్రం నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. తల్లికూతుళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక మరేమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడిలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

