నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి రజిత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

