నిజామాబాద్, బతుకమ్మ: విపత్తుల సంభవించినప్పుడు పరిస్థితులను ఎదుర్కొనే విధానంపై అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ వలంటీర్లకు ఏర్పాటు చేసిన శిక్షణను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో సోమవారం ప్రారంభించారు. ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వలంటీర్లకు 20 రోజులపాటు ‘ఆపద మిత్ర’ పేరుతో శిక్షణ కొనసాగనుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి చోటా అందుబాటులో ఉండే అవకాశాలు లేకపోవడంతో కమ్యూనిటీ వలంటీర్లకు శిక్షణ అందించే కార్యక్రమానికి 2016లో శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రయోగాత్మకంగా దేశంలోని 30 జిల్లాల్లో మొదటగా శిక్షణ అందించారని, మంచి ఫలితాలు రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వలంటీర్లను ఎంపిక చేసి ఆపద మిత్ర పేరుతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రకృతిపరంగా లేదా మానవ తప్పిదాల కారణంగా విపత్తులు సంభవించిన సందర్భాల్లో సామాజిక కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపడతారన్నారు.
