వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న పవన్ కళ్యాణ్, డిశ్చార్జ్ అయిన వెంటనే నేరుగా హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. వైద్యుల సూచనల మేరకు మరో మూడు వారాల తర్వాత నుంచి ఫిజియోథెరపీ ప్రారంభించనున్నారు. శస్త్రచికిత్స జరిగిన కుడి భుజం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి సుమారు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు పవన్ కళ్యాణ్ వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకోనున్నారు. పూర్తిగా కోలుకున్న అనంతరం ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది.

