. . . కార్మిక, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు
నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ సంఘాల ఐక్య కార్యకరణ కమిటీ ఆధ్వర్యంలో హమాల్ వాడీలోని సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. దాసు,ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ లు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రైతు ఉద్యమ సమయంలో దేశ రైతాంగానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలన్నారు. ఉచిత నాణ్యమైన విద్యా, వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి చర్యలను ఆపాలన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 26న జరిగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయం జిల్లా బాధ్యులు వి. ప్రభాకర్, ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షుడు సాయన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, వివిధ రంగాల నాయకులు గంగారెడ్డి, రాజేశ్వర్, శివకుమార్, గణేష్, సాయిబాబా, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
