. ధర్మపురి హిల్స్ లో ప్రభుత్వ భూమి కబ్జాపై ‘బతుకమ్మ’లో కథనం
. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఎంఐఎం ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో సర్వే నంబర్ 249, 252లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం పార్టీ నాయకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు శనివారం విన్నవించారు. ప్రభుత్వ భూమి కబ్జా ప్రయత్నాలను వెలుగులోకి తీసుకొచ్చి ‘బతుకమ్మ’లో ప్రచురించిన కథనాన్ని కలెక్టర్ దృష్టికి నాయకులు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్ లో కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు ఓ రౌడీషీటర్ తో కలిసి కుట్రపన్నారని అన్నారు. దీని వెనుక ఉన్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ డిపార్ట్ మెంట్ అనుమతులు లేకుండా బండరాళ్లను పేల్చారని తెలిపారు.
రాజకీయ ఒత్తిళ్లతో సంబంధిత శాఖాధికారులు సరైన విచారణ చేయలేకపోతున్నారని, దీనిపై దృష్టి సారించాలని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఎంఐఎం జిల్లా, పట్టణ అధ్యక్షులు ఫయాజ్ అహ్మద్, షకీల్ అహ్మద్, సెక్రెటరీ ముజీబ్ అహ్మద్, జాయింట్ సెక్రెటరీలు హుస్సేన్, ఓవైసీ అహ్మద్, ట్రెజరర్ అయాజ్ అహ్మద్, మెంబర్లు నసీర్, రియాజ్, అజీజ్ ఖాన్, అజీమ్ బాబా, షేక్ ఖలీల్ అహ్మద్, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.

