- మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
బతుకమ్మ , బాన్సువాడ : మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీకి చెందిన స్వామీ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం బాన్సువాడ బంద్ నిర్వహించారు. స్వచ్ఛందంగా వ్యాపార దుకాణాలు మూసి ఉంచారు. పూజారిగా పనిచేసే స్వామీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇరువురిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దేశంలో అన్నిమతాల వారు సోదరభావంతో మెలుగుతున్నారు.

అలాంటి దేశాన్ని ఒక మతం పేరుతో విభజించాలనుకోవడం సరైంది కాదన్నారు.దేశానికి స్వాతంత్య్రం రావడానికి కారకులైన నాయకులలో ముస్లిం వర్గానికి చెందిన నాయకులు కూడా ఉన్నారనే సంగతిని మరువరాదన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను టార్గెట్గా ఎంచుకోవడం సరైంది కాదన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఏ హక్కులైతే వర్తిస్తాయో ఆ హక్కులన్నీ కూడా ముస్లింలకు వర్తిస్తాయనే సంగతి నేతలందరూ గుర్తెరగాలన్నారు. కావున ఇప్పటికైనా ముస్లింలను తక్కువ చేసి మాట్లాడే పద్ధతులకు స్వస్తి పలికి సోదరభావంతో కలిసి మెలసి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మెనార్టీ నేతలు అబ్దుల్ వాహబ్ , ఎజాస్ , షాహబ్ , దావుద్ , మత పెద్దలు తో పాటు , ముస్లింలు యువకులు పాల్గొన్నారు.

