నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కేవలం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటం కాదని, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. నిజాం పాలనలోని భూస్వామ్య, జమీందారీ దోపిడీ,వెట్టి చాకిరీ, అక్రమ పన్నులు,రైతులపై సాగిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేద రైతులు,వ్యవసాయ కూలీలు,సామాన్య ప్రజలు సాగించిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని తెలిపారు. ఈ పోరాటంలో హిందువులు,ముస్లింలు సహా వివిధ వర్గాల ప్రజలు కలిసి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. చిట్యాల ఐలమ్మ ఒక పేద బహుజన మహిళగా భూస్వామ్య పెత్తనాన్ని ఎదిరించి, తన భూమి హక్కు కోసం పోరాడటమే కాకుండా వేలాది మంది పేదలకు ధైర్యాన్ని ఇచ్చారని రమేష్ బాబు తెలిపారు. ఐలమ్మ పోరాటాన్ని మతాల మధ్య ఘర్షణగా చిత్రీకరించడం ఆమె త్యాగాలను, తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, సురేష్,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం, నగర నాయకులు అనసూయమ్మ, అనిత, ఉద్దవ్, అబ్దుల్, శంషాద్దీన్, అంజయ్య, ఈవీఎల్ నారాయణ, గోపి,రాజు తదితరులు పాల్గొన్నారు.
