. . . 2027 వరకు కాలం పరిమితి ఉన్నా చెత్తలో పారవేత
భిక్కనూర్, బతుకమ్మ :
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ మందులను నేషనల్ హైవే 44 రోడ్డు పక్కన నిరుపయోగంగా పారేయడం కలకలం రేపుతోంది. భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర్ నగర్ వజ్రా ఎంక్లేవ్ ఎన్ హెచ్ 44 హైవే పక్కన పెద్ద ఎత్తున టాబ్లెట్లను గుట్టలుగా పడేసి వెళ్లారు. వాటిలో కాల్షియం, విటమిన్ డి3, డైక్లోఫెనాక్ వంటి ఖరీదైన మందులు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా వాటిపై కాలపరిమితి తేదీ 2027 వరకు ఉంది. అంటే ఇంకా ఏడాదిన్నర వరకు వాడుకోవచ్చు.ఇవి ప్రభుత్వ ఆసుపత్రులకు, పీహెచ్ సీలకు సప్లయ్ చేసే మందులేనని బాక్స్ లపై ఉన్న లేబుల్స్ చెబుతున్నాయి. ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులను ఇలా చెత్తలో పారేయడం వెనుక ఎవరున్నారు? లెక్కల్లో చూపించి బయటకు తరలించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విలువైన మందులను ఇలా రోడ్డు పక్కన పారేయడం ప్రభుత్వ సొమ్మును వృథా చేయడమేనని, దీనిపై జిల్లా వైద్యాధికారి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


