. . . అధికారులకు కలెక్టర్ భవేష్ మిశ్రా దిశానిర్దేశం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా జనగణన హ్యాండ్బుక్ (డీ.సీ.హెచ్.బీ) రూపకల్పన కోసం ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో, ఆయా రంగాల ప్రముఖులతో జనగణన–2027కు సంబంధించి జిల్లా స్థాయిలో రూపొందించే హ్యాండ్బుక్ కు అందించాల్సిన సమాచారం విషయమై చర్చించి సూచనలు చేశారు.

విద్యా, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, సమాచార వ్యవస్థ, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, చేతివృత్తులు, కళలు, సాహిత్యం, ప్రముఖ వ్యక్తులు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, పరిశ్రమలు, పురావస్తు సంపద తదితర అంశాలకు సంబంధించిన జిల్లా సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించేలా చూడాలన్నారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ రాబోయే పది సంవత్సరాల పాటు సమాచార సేకరణ, ప్రణాళికల రూపకల్పనకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథంగా నిలుస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సమాచార సేకరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారం రోజులలో సంబంధిత శాఖలు సమాచారాన్ని సేకరించి అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇంచార్జి సీ.పీ.ఓ కిషన్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

