. . . కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ :
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటుకునేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాటిపల్లి వెంకట రమణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని, ఆ మహనీయుల సేవలను నేటి తరానికి గుర్తు చేయడమే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించేందుకు ప్రతి కుటుంబం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. జాతీయ జెండా రెపరెపలాడేలా చేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సూచించారు.
