ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన లైన్మెన్ అఫ్జల్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని పేర్కొంటూ, లైన్మెన్ను విధుల నుంచి తొలగించాలని కోరారు. గ్రామ సర్పంచ్ గంగమని గంగారాం, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రియాజ్, వైస్ చైర్మన్ బాగిర్తి నారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాన్స్కో ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్యలు మరింత తీవ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇందల్వాయి గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో రాత్రి సమయాల్లో పాములు, ఇతర జంతువులు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని, అందువల్ల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో ఏఈ, ఎస్ఈలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తేలు రాములు, బండి సుదర్శన్, తుమ్మల సత్యం, ఎడపల్లి నడిపి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
