. . . కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర
భిక్కనూరు, బతుకమ్మ :
సైబర్ నేరాలపై ప్రజలు, యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం భిక్కనూరు మండల కేంద్రంలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసం చేస్తున్నారని, తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే ఓటీపీ, సీవీవీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని, ఆన్లైన్ లోన్ యాప్స్, ఉద్యోగాల పేరుతో వచ్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అనుమానం ఉంటే వెంటనే 1930 కు డయల్ చేయాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రాణాలు పోతున్నాయ ని, వేగంగా వెళ్లడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని, ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సు ద్వారా యువత, ప్రజలు సైబర్ మోసాల పట్ల, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నరేష్, ఎస్సై అనిల్, కామారెడ్డి గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సర్పంచ్ బల్యాల రేఖ, మండల సర్పంచ్లు, పోలీసు అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
