. . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వంతెన పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో నాణ్యతకు ఎలాంటి రాజీ పడకూడదని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బలమైన నిర్మాణ ప్రమాణాలను పాటించాలని సూచించారు.

వంతెన మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, అవసరమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్, రాజేశ్ చంద్ర, మండల ప్రత్యేక అధికారి సురేందర్, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) ప్రభాకర్, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు సిఐ రాజారెడ్డి, తహసీల్దార్ సురేష్ ఎంపీడీవో బ్రహ్మానందం, స్థానిక ఎస్సై దీపక్ కుమార్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

