. . . బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో తిరుమల మెడికల్ కాలేజీలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి మిస్డ్ కాల్, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం వంశీ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల విడుదలలో విఫలమైందని ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు అప్పులు చేసి చదువులు కొనసాగించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. విద్య ప్రతి విద్యార్థి హక్కు అని, ఆ హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేవైఎం పోరాటం కొనసాగుతుందని వంశీ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. కళాశాలల్లో విద్యార్థులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థి ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని, మిస్డ్ కాల్, క్యూఆర్ కోడ్ ద్వారా సంతకం చేసి తమ డిమాండ్కు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు. జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చొరవ చూపి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, జిల్లా నాయకులు విపుల్ రావు, రాజ్ గణేష్, రాకేష్, యువ మోర్చా మండల అధ్యక్షుడు రమణ, ఇతర నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

