కామారెడ్డి, బతుకమ్మ :
సదాశివనగర్ మండలంలో ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన సదాశివనగర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన సంగేమ్ అజిత్ కుమారుడు లక్ష్మణ్ (9) స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. సదాశివ నగర్ మండలంలోని యాచారం గ్రామం వద్ద బాలుడిని ఒక ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తక్షణమే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే సరికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పసివాడి మృతితో కుటుంబ సభ్యులు, చంద్రాయన్ పల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
