తక్కువ వర్షపాతానికి అనుకూల పంటలు సాగు చేయాలి

0 9,894

 

. . . వ్యవసాయ అధికారి వీర స్వామి

 

మోర్తాడ్, బతుకమ్మ:

 

రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణను చేపట్టాలని వ్యవసాయ అధికారి వీర స్వామి కోరారు. మోర్తాడ్ మండలంలోని మోర్తాడ్ గ్రామ రైతు వేదికలో గురువారం రైతులకు పంటల వైవిధ్యీకరణ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వీర స్వామి మాట్లాడుతూ, ప్రస్తుత వానాకాలంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల వర్షాధార పంటలైన కందులు, సజ్జలు, మొక్కజొన్న వంటి పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. తక్కువ వర్షపాతం పరిస్థితుల్లోనూ ఈ పంటలు మెరుగైన దిగుబడులను అందించే అవకాశం ఉందని, రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన వివరించారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, వ్యవసాయ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చని అధికారులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్, మండల హార్టికల్చర్ అధికారి రాజగౌడ్, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) శ్రీలత, లకపతి, మహేష్ భార్గవ్‌, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.