. . . యువతను మోసం చేసిన కాంగ్రెస్ను తెలంగాణలోనూ తరిమికొడతారు
. . . కాంగ్రెస్ను తన్ని తరిమితేనే రైతు ప్రభుత్వం తిరిగి వస్తుంది
. . . రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మంచిర్యాల, బతుకమ్మ :
దేశ రాజధాని ఢిల్లీలో యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇలాంటి తీవ్రమైన ఆందోళనలు, ఉద్యమాలే త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లోని లక్షేట్టి పేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో వేలాది మంది యువత పార్లమెంట్ వద్ద నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన దృశ్యాలను దేశం చూసిందని, అదే పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతుందని కేటీఆర్ హెచ్చరించారు. యువత ఆకాంక్షలను పట్టించుకోకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని, కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు తిరస్కరించే పరిస్థితి వస్తుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో యువత మరోసారి తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. యువత ఆకాంక్షలను తుంగలో తొక్కి, రెండు లక్షల ఉద్యోగాలు, యువత డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి నిరుద్యోగులను నిండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ యువత కూడా నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. యువ సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ఎలా మోసం చేసిందో రాష్ట్ర ప్రజల ముందు ఉంచామని కేటీఆర్ తెలిపారు. ఆ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ కనిపించినా నిరుద్యోగ యువత వదిలిపెట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక్కడు దొరికితే తెలంగాణ యువత పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినట్లే యువత మరోసారి ఉవ్వెత్తున ఎగిసిపడే పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వమే సృష్టిస్తోందన్నారు. అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రైతు డిక్లరేషన్ పేరుతో 34 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా నెరవేర్చలేదన్నారు. “మోసపోతే గోసపడతాం” అని కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతాంగం అష్టకష్టాలు పడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువని ఆరోపించారు. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వం కనీసం స్పందించలేదని మండిపడ్డారు. రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎనిమిది గంటలపాటు ధర్నా చేసినా ప్రభుత్వం మనసు కరగలేదన్నారు. రెండున్నర నెలలు గడిచినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదని విమర్శించారు. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తరఫున మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ద్వారా కూడా ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు అందాయని గుర్తుచేశారు. నలుగురు రైతులు చనిపోయినా రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లైనా లేదని తీవ్ర విమర్శలు చేశారు. షాపుల్లో దొరికే యూరియాను యాప్ ద్వారా మాత్రమే ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఓటేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కాటేస్తోందని మండిపడ్డారు. నాలుగు విడతల రైతుబంధు నిధులను కూడా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు. కరువుకు శాశ్వత పరిష్కారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎత్తిపోసే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరాన్ని వినియోగించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాళేశ్వరం ద్వారా మూడు మార్గాల్లో నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని, మేడిగడ్డకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని చెప్పారు. కన్నెపల్లి వద్ద 94 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోందని, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను సమన్వయంతో నడిపితే ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగి 36 నెలలు గడిచినా మరమ్మతులు ఎందుకు చేపట్టడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు.

రూ.400 కోట్లతో మరమ్మతులు చేస్తామని చెప్పిన వారినే ప్రభుత్వం బెదిరించి పంపించిందని ఆరోపించారు. కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తవద్దని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదని, రిటైర్డ్ ఇంజినీర్ల బృందం పదేపదే ఇదే విషయాన్ని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తిట్లు తిట్టడం తప్ప పాలన తెలియదని, రైతులు నీళ్లు అడిగితే రక్తం చల్లాలంటూ మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఏ ప్రశ్న అడిగినా “నీ జాతి ఏంటి?” అని ఎదురుదాడి చేయడం ముఖ్యమంత్రికి అలవాటైందని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో మళ్లీ రైతు ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ నాయకులను ప్రజలు రాజకీయంగా ఉరికించి తరిమికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే రైతులకు, యువతకు, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే 31 నెలలుగా అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక మిగిలింది 29 నెలలే అని, కాంగ్రెస్ సినిమా ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని విమర్శించారు. మంచిర్యాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను వేధించే ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించిన కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కాంగ్రెస్ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచిస్తూ, ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడవద్దని అన్నారు. ఏడు సముద్రాలు దాటి దాక్కున్నా ప్రజలను వేధించిన వారిని వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్ రావు, బాల్క సుమన్, కోరుకంటి చందర్ పార్టీ నాయకులు ఉన్నారు.

