నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం బి.ఏ., బీకాం, బి.బి.ఏ., బి.ఎఫ్.ఎస్.ఐ. కోర్సుల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా, మౌలిక వసతులు, ఉత్తమ ఫలితాల సంప్రదాయం, అకాడమిక్ కార్యకలాపాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు కళాశాల అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్. రంగరత్నం మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.

చరిత్ర విభాగాధిపతి రమేశ్ గౌడ్ కళాశాల నియమ నిబంధనలను వివరించగా, పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ పరీక్షల నిర్వహణ విధానం, నిబంధనలను వివరించారు. ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కళాశాల విద్యా, సహపాఠ్య కార్యక్రమాలను విద్యార్థులకు పరిచయం చేశారు. జిల్లా సాంస్కృతిక కళల సమన్వయకర్త అష్ట గంగాధర్ తన పాటలతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అకాడమిక్ కోఆర్డినేటర్లు నహేద్ బేగం, రాహుల్, వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీఆర్ఓ డాక్టర్ దండుస్వామి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి, బి.బి.ఏ. విభాగాధిపతి డాక్టర్ రంజితతో పాటు అధ్యాపకులు అనసూయ, షేక్ చాంద్, రజిత, సుధాకర్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, సుమన్, సుభాషిణీదేవి, జయశ్రీ తదితరులు, పెద్ద సంఖ్యలో మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

