. . . రిటైర్డ్ ఉద్యోగులు, ఎన్ సీ సీ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటును అందించాలి
. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓలతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, ఎన్ సీ సీ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఒకింత వెనుకబడి ఉన్నందున ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దిష్ట గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఈ దిశగా రిటైర్డ్ ఉద్యోగులు, ఎన్ సీ సీ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం సరైన విధంగా నింపి సకాలంలో బీ ఎల్ ఓ లకు అందించేలా చొరవ చూపాలని అన్నారు. గత 2002 ఎస్ ఐ ఆర్ జాబితా వివరాలను బీఎల్ఓ యాప్ ద్వారా లేదా ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుండి పొందవచ్చని సూచించారు. ఒకవేళ ఆ వివరాలు లభించని వారు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని జత చేస్తూ ఎన్యూమరేషన్ ఫారం అందించవచ్చని సూచించారు. ఈ విషయాలపై ఓటర్లను అవగాహన కల్పిస్తూ ప్రతి ఓటరు గడువు కంటే ముందే ఎన్యూమరేషన్ ఫారంలు అందించేలా చూడాలన్నారు.

అప్పుడే ఆబ్సెంట్, షిఫ్టెడ్, డిలీట్, డెత్ ఓట్లను గుర్తించేందుకు వీలవుతుందని, ఎన్యూమరేషన్ ఫారంల డిజిటలైజ్ సకాలంలో జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలను అందించని ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుండి తొలగించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం బీ ఎల్ ఓ లకు అందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీవైఎస్ఓ పవన్ కుమార్, ఎన్ సీ సీ అధికారి రాజశేఖర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, ఏఈఆర్ఓ లు పాల్గొన్నారు.

