ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా డీఆర్ఓ గీత గురువారం స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తహసీల్దార్ బాలయ్యతో మాట్లాడుతూ, కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన అవసరమైన పత్రాలను జిల్లా కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మండల కార్యాలయాల నిర్మాణానికి ఒక్కో మండలానికి రూ.2.25 కోట్ల చొప్పున నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా నూతన కార్యాలయ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందల్వాయి మండలానికి నిధులు మంజూరు కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కృషి చేశారని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలయ్య, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఆర్ఐ ప్రవీణ్, రెవెన్యూ సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
