ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలో రేణుక ఎల్లమ్మ పండుగను పురస్కరించుకొని సోమవారం గంగపుత్ర సంఘ సభ్యులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగపుత్ర సంఘానికి చెందిన మహిళలు ఐదు బోనాలతో ఎల్లమ్మ విగ్రహాన్ని తీసుకుని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గంగమ్మ గుడి వరకు వెళ్లారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం, గౌడ సంఘ సభ్యులు కలిసి గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. చెరువు, నది తీర ప్రాంతాల్లో పారే గంగమ్మకు కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి కుషి తెప్పను విడిచినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు, గౌడ సంఘ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మ పండుగను సమిష్టి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

