. . . రెండ్రోజులుగా నామమాత్రపు తనిఖీలు
. . . నోటీసులతో సరి
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గత రెండు రోజులుగా వివిధ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా అపరిశుభ్రత కలిగిన వంటశాలలు, పాత్రలు అపరిశుభ్రంగా ఉండడం, నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం, కృత్రిమ రంగు వేసిన మాంసం అమ్మకానికి ఉంచడం, ఫ్రిజ్లో ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం – కలుషితమైన ఆహారాన్ని వెంటనే ధ్వంసం చేయడం జరిగిందన్నారు. మూతలు లేని పాత్రల్లో ఆహారాన్ని బహిరంగంగా ఉంచడం వాటిని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆహార వ్యాపారులు ఆహార పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం కారణంగా ఆహారం కలుషితమై ప్రజారోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఐ చట్టం 2006 సెక్షన్ 32 ప్రకారం ఇంప్రూమెంట్ నోటీసులు జారీ చేశారు. 14 రోజుల్లో లోపాలను సరి చేయని వారిపై కఠినంగా జరిమానాలు విధించి, లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకోబడుతాయన్నారు. ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ లేని, అపరిశుభ్రంగా ఉన్న దుకాణాల నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయవద్దని ప్రజలకు ఆహార భద్రతా శాఖ విజ్ఞప్తి చేసింది.

తినే అన్నంలో కల్తీలు . . . తాగే పాలలో రసాయనాలు చివరకు పసిపిల్లలకు పట్టే పాలపొడిలు ప్రాణాంతక పదార్థాలు. లాభార్జనే ధ్యేయంగా హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మొదలుకుని చివరకు టీ స్టాల్ లలో కూడా కల్తీ ఆహార పదార్థాల అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బేకరిలలో తయారయ్యే ఉత్పత్తులకు ఎక్స్ పైరీ డేట్ లేకుండానే ప్యాకింగ్ లు బయటకు వస్తున్నాయి. వాటితో పాటు రెడిమెడ్ తినుబండారాల తయారీలోనూ, ప్యాకింగ్ లోనూ ఇదే మోసం కనబడుతుంది. ప్రధానంగా జిల్లాలో నాన్ వెజ్ ఫుడ్ ను విక్రయించే స్టార్ హోటల్ మొదలుకుని దాబాల వరకు వినియోగించే మాంసంతో పాటు అందులో ఉండే పదార్థాలకు చివరకు మసాలలు కూడా కల్తీనే వినియోగిస్తున్నారు. వంటలో వాడే నూనె మొదలుకుని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వాడే సాస్ ను కూడా కల్తీగా తయారి చేసి వినియోగిస్తున్నా పట్టించుకునే వారు లేరని విమర్శలున్నాయి.

ప్రధానంగా జంతువధ నిషేదం ఉన్న శనివారాల్లో హోటళ్ళు, దాబాలు, మండిలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో మాంసం వినియోగిస్తుంటే అది రెండు రోజుల ముందుగా ఫ్రీజ్ లో ఉంచిన మాంసం పదార్థాలను వండి విక్రయిస్తుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్లుమూసుకున్నారన్న వాదనలు లేకపోలేదు. శనివారం పూట జిల్లాలో అధికారులే ఉండరని ఇక తనిఖీలు ఎక్కడ అని విమర్శలున్నాయి. హాస్టళ్ళు, హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లకు లైసెన్స్ లు లేకున్నా నిర్వహిస్తుంటే పట్టించుకునే వాడే లేరనే ప్రధాన ఆరోపణ ఉంది. అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉద్యోగుల కొరత పేరుతో అందుబాటులో ఉండరనే విమర్శలు లేకపోలేదు.

