. . . నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు వ్యాపారం
. . . పట్టించుకోని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ :
ఇటుక బట్టీలపై అధికారుల నిఘా కొరవడింది. నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాయకూర్ గుట్ట ప్రాంతంలో, కొందాపూర్ గ్రామాలల్లో ఎక్కడపడితే అక్కడ పుట్ట గొడుగుల్లా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకున్నా ఇటుకల వ్యాపారం జోరుగా సాగుతోందని, చాలామంది వ్యాపారులు ప్రభుత్వానికి నయాపైసా కూడా చెల్లించడం లేదని ఆరోపణలు వెలువేత్తుతున్నాయి. వ్యాపారులు ఐదు శాతం (వ్యాట్) చెల్లించడం గాని అనుమతులు పొందడం లాంటివి చేయడం లేదని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటుకల తయారీ కోసం కోసం పొలాలు, గుట్టలలో, అటవీ ప్రాంతంలోని మట్టిని తవ్వి ఇటుకలు తయారు చేస్తున్నారు. మట్టిని తవ్వాలంటే భూగర్భ శాఖ, గ్రామ పంచాయతీ అనుమతి కూడా ఉండాలి. మండలాలల్లో కుప్పలు తెప్పలుగా ఇటుక బట్టీలు వెలిసినా ఏ ఒక్క దానికి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. ఇటుకలు విక్రయించగా అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వీటికి ఐదు శాతం ఉంటుంది. ఈ విక్రయాలకు పన్ను చెల్లించాల్సి ఉన్నా అది కూడా అమలు కావడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చెట్లను నరికివేసి ట్రాకర్లలో ఇటుక బట్టిలకు తరలిస్తున్నారు.

. . . నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల వ్యాపారం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీల నిర్వహణ చేయాలంటే గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారుల, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఫారెస్ట్ తదితర శాఖల వద్ద అనుమతులు పొందాలి. ప్రజా నివాస ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో పంట పొలాలకు కనీసం వంద మీటర్ల దూరంలో, ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ బట్టీల నిర్వహణ కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా ఎటువంటి నియమాలు పాటించకుండా జనావాసాల మధ్య బట్టీలు ఏర్పాటు చేయడంతో దాని నుంచి వచ్చే కాలుష్యం వలన చాలా ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
. . . అధికారుల చర్యలేవి
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు వెలుస్తున్న సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో మట్టి కోసం చెరువులు, పొలాలు, గుట్టలను తవ్వుతున్నా అటవీశాఖ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నా బట్టీలపై దాడులు చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారికి వచ్చే మామూళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాపారం జోరుగా సాగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ఇటుక బట్టీల పై చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.

