. . . తాళం వేసిన ఇంట్లో చోరీ
బాన్సువాడ, బతుకమ్మ :
తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ కు చెందిన వడ్ల రాజు కొత్త ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ప్రస్తుతం కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే తన పాత ఇంటికి తాళం వేసి ఉంచాడు. గురువారం రాత్రి ఆలస్యంగా ఇంటి వద్దకు వెళ్లిన రాజు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టబడి ఉండడాన్ని గమనించాడు. అనుమానం రావడంతో లోపలికి వెళ్లి పరిశీలించగా ఇంట్లోని సామాన్లు చిందరవందరగా పడి ఉండడంతో పాటు బీరువా తెరిచి ఉండడం కనిపించింది. బీరువాలో భద్రపర్చిన సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 13 తులాల వెండి ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలం వద్ద ఆధారాలను సేకరించి పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
