. . . మామిడి చెట్ల నరికివేత
. . . బాధితుడిపై బెదిరింపులు
ఇందల్ వాయి, బతుకమ్మ :
మండల పరిధిలోని గౌరారం గ్రామ శివారులో భూ కబ్జా యత్నం కలకలం సృష్టించింది. బాధితుడు చెలమెల నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం… గౌరారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 180 లో తనకు చెందిన భూమిని గత 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడు. కాగా, బుధవారం ఉదయం పక్కనే ఉన్న ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సరిహద్దు వివాదాన్ని సృష్టిస్తూ, నర్సయ్య భూమిలోకి అక్రమంగా చొరబడ్డారు. అక్కడ ఉన్న మూడు పెద్ద మామిడి చెట్లతో పాటు, ఉసిరి మరియు ఇతర చిన్న చెట్లను దౌర్జన్యంగా నరికివేశారు.

దీనిని గమనించి అడ్డుకోవడానికి వెళ్లిన బాధితుడు నర్సయ్యపై సదరు వ్యక్తులు తీవ్ర పదజాలంతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరింపులకు దిగారు. బాధిత రైతు నర్సయ్య ఈ విషయమై ఇందల్వాయి తహశీల్దార్ మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత పాతికేళ్లుగా తన ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేయడమే కాకుండా, చేతికొచ్చిన పంట చెట్లను నరికివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆయన అధికారులను వేడుకుంటున్నారు.

