. . . పది ఏళ్లు వ్యవసాయాన్ని పండుగలా మార్చాం
. . . కానీ కాంగ్రెస్ రైతులు మళ్లీ రోడ్డెక్కెలా చేసింది
. . . పది రోజుల్లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
. . . లేదంటే ప్రధాన రహదారులను దిగ్భందం చేస్తాం
. . . బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, బతుకమ్మ :
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ధర్నాలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు కరెంటు, నీళ్లు, మద్దతు ధర కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు వ్యవసాయాన్ని పండుగలా మార్చామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు మళ్లీ రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రభుత్వం ప్రచారం చేస్తోందే తప్ప, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. తాను ఇటీవల నియోజకవర్గంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు మహిళా రైతులు సహా రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూసి కలచివేసిందన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.2380 ఉండగా, వ్యాపారులు కేవలం రూ.1750 నుండి రూ.1900 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల రైతుకు ఎకరాకు రూ.15 వేల నుండి రూ.20 వేల వరకు నష్టం జరుగుతోందని వివరించారు. కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యల కంటే ఇసుక దందాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. కలెక్టర్, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ఎత్తడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలతోనే బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రైతు బంధు నిధులు సక్రమంగా అందడం లేదని, రెండు లక్షల రుణమాఫీ ప్రకటనలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లాలో ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందని రైతులే చెబితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని, సరిపడా గన్నీ సంచులు, లారీలు అందుబాటులో ఉంచాలని, 41.5 కిలోలకు మించి తరుగు పేరిట జరుగుతున్న అక్రమ వసూళ్లను కఠినంగా అరికట్టాలని, అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని, దొడ్డు రకాల ధాన్యానికి కూడా గ్రేడ్-1 మద్దతు ధర కల్పించాలని, యాప్ విధానాన్ని రద్దు చేసి యూరియాను అన్ని సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి 10 రోజుల గడువు ఇస్తున్నామని, ఈలోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపాడ్ నుండి చిట్టాపూర్ వరకు, లక్కోరా నుండి కమ్మర్పల్లి వరకు ప్రధాన రహదారులను రైతులతో కలిసి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వంటా-వార్పు కార్యక్రమాలతో ఎలా పోరాడామో, అదే స్ఫూర్తితో రైతులే నాయకులుగా ముందుకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

. . . ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, రైతులతో ఫోన్ లో మాట్లాడిన జిల్లా కలెక్టర్
బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మోర్తాడ్లో నిర్వహించిన రైతు ధర్నా ఉద్రిక్తంగా కొనసాగింది. ధర్నా సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి రైతుల డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్ తరఫున జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్, డీఎస్ఓ శ్రీకాంత్ తదితర అధికారులు ధర్నా స్థలానికి చేరుకుని రైతుల సమస్యలపై అక్కడినుండే కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడించిగా వడ్ల కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, అలాగే రైతులు ఉంచిన ఇతర డిమాండ్లను కూడా సానుకూలంగా పరిశీలించి అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే, రైతులు ధర్నా విరమించారు.

