. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నీట్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయబడుతుందని, కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అర్సపల్లి పరిధిలో మే 2న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మోడల్ సైన్స్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (పాత సెక్షన్ 144 సి.ఆర్.పి.సి) అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమన్నారు. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు శనివారం అన్ని పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ సీపీ విద్యార్థులకు “ ఆల్ ది బెస్ట్ ” తెలిపారు.
