. . . సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది
. . . తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కార్యక్రమానికి బాన్సువాడ బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పూర్తి మద్దతు ప్రకటించాయి.ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో నిరసన గళం వినిపించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబెర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, వారి న్యాయమైన డిమాండ్లను ఏమాత్రం జాప్యం చేయకుండా తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం బాన్సువాడ సబ్ కలెక్టర్ను కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందని, వారికి వంద శాతం అండగా నిలుస్తామని నాయకులు స్పష్టం చేశారు.

కార్మికులకు ధైర్యం చెబుతూ,తమ హక్కుల సాధనలో వెనకడుగు వేయవద్దని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్మికుల పక్షాన పోరాటం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, కార్మికుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అంజి రెడ్డి, రత్న కుమార్, షేక్ అక్బర్, ఫిరోజ్ ఖాన్, శ్రీనివాస్, ఖలీల్, మక్బూల్, రామచంద్ర, సమీర్ ఇతర పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
