. . . స్మార్ట్ ఫోన్ కు అలవాటుపడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు
. . . పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సెలవులను ఉల్లాసంగా గడుపుతూ, ఇష్టమైన రంగంలో ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకునేలా కృషి చేయాలని, సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. డిచ్ పల్లి మండలం సుద్దపల్లిలో గల సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం నిర్వహించిన పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ కు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో భేటీ అయ్యారు.

నేటి నుండి వేసవి సెలవులు లభించగా, సెలవులలో ఏం చేస్తారని విద్యార్థులను వారి ప్రణాళిక గురించి అడిగి తెలుసుకున్నారు. స్విమ్మింగ్, కరాటే, డ్యాన్స్, సంగీతం వంటి వాటిలో తమ అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

వీలైతే చారిత్రక ప్రదేశాలను సందర్శించాలని అన్నారు. సెలవులను వృథా చేసుకోవద్దని, స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, వారంలో అర గంటకు మించి పిల్లలు స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా చూడాలన్నారు. బాలికల పట్ల వివక్షత చూపకుండా వారిని ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. రెసిడెన్షియల్ స్కూల్ లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థినులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ నళిని, తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

