. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
. . . నిజామాబాద్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యువతే దేశానికి భవిష్యత్తని, యువతలో ఉన్న శక్తి, సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రూరల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆదివారం 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బై పాస్ చౌరస్తా నుండి ఐ.డి.ఓ.సి కార్యాలయం వరకు నిర్వహించిన ఈ 2కే రన్ ని ముఖ్య అతిథిగా హాజరైన సీపీ జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రీడలు, వ్యాయామం చాలా అవసరమన్నారు. అలాంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని, ఇటీవల కాలంలో యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యంత అవసరమని, ఒకసారి ఆ అలవాట్లలో పడితే బయటపడటం చాలా కష్టమని తెలిపారు. యువకులు, విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై డ్రగ్స్ బారిన పడకూడదని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ గాని, గంజాయి గాని అమ్మినా, సేవించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 1908 నెంబర్ లేదా 100 కు కాల్ చేయాలని సూచించారు. ఈ సొసైటీ ని డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా మార్చాలని, దీనికి ప్రజల సహకారం, యువత సహకారం, మీడియా సహకారం ఉండాలని కోరారు. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అని ప్రతి ఒక్కరికి సూచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు డాన్సులు, నాటకాల రూపంలో గంజాయి యొక్క పర్యావసనాలని ప్రజలకు చూపించారు. ఈ 2కె రన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, నిజామాబాద్ రూరల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎస్సైలు ఎండి షరీఫ్, ఆనంద్ సాగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గిరిరాజు కాలేజ్, సీఎస్ఐ కాలేజ్, వివేకానంద హై స్కూల్, ప్రభుత్వ డైట్ కాలేజీ, ఎస్సీ హాస్టల్, డిఎస్ టెక్నాలజీ మొదలగు కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.

