. . . అక్రమ కేసులు ఎత్తివేసి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
. . . కలెక్టర్ కార్యాలయం ముందు టీయుసీఐ, సీఐటీయు, ఏఐటీయుసి సంఘాల ధర్నా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులను నివారించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని తక్షణమే వేతనాలు చెల్లించాలని టీయుసీఐజిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయుసీఐ, సిఐటియు, ఎఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అడిగితే కేసులు పెట్టడం సరికాదన్నారు. వెంటనే ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాంటాక్ట్ ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి, సిఐజి గ్రూపుల కార్మికులకు ఇవ్వకపోవడం అధికారుల కక్షాపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. మున్సిపల్ కార్మికులకు రేపటిలోగా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను కొనసాగిస్తూ, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కార్మికులను గ్రూపులుగా చేయాలన్నారు.ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26వేలు ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, నాయకులు కిరణ్, రవి, యాదమ్మ, శాంతికుమార్, విజయ్, గంగాధర్, లక్ష్మి, శైలజ, నవీన్, నరేష్ రాము మహిపాల్, సహదేవ్, వినోద, మాధవి, సాయిలు, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

