కాజీపేట్, బతుకమ్మ :
తెలంగాణ రైల్వే జె.ఏ.సి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా నిరసన దీక్షకు తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాజీపేటను రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ రైల్వే జె.ఏ.సి నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా భూనిర్వాసితులు, స్థానిక గ్రామాల ప్రజలు, అలాగే రైల్వేలో ఆక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టాలని, ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ ద్వారా నియామకాలు చేపట్టకూడదని, ఈ డిమాండ్లపై రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని వారు కోరగా, ప్రొఫెసర్ కోదండరాం ఈ డిమాండ్లకు మద్దతు తెలుపుతూ తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

