. . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల
. . . లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోగా వారి నుంచి 124 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు శనివారం ప్రత్యేక బస్సులలో లొంగిపోయిన మావోయిస్టులు చేరుకున్నారు. లొంగిపోయిన వారిలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన వారిలో 125 మంది ఉన్నారు. తెలంగాణ నుంచి నలుగురు ఉండగా, ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. వారి క్యాడర్ ను బట్టి నగదు పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఆయుధాలను వీడండి జనజీవన స్రవంతిలోకి రండి అన్న నినాదం ఫలితాలన్నిచ్చాయి.

తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో మొత్తం 11 మంది మావోయిస్టులు ఉండగా వారిలో శనివారం నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలిన ఏడుగురు తెలంగాణకు చెందిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అయితే ఈ లొంగుబాట్లలో మావోయిస్టు అగ్రనేత గణపతి లేకపోవడంతో ఆయన ఇంకా అజ్ఞాతం వీడలేదు. గణపతితో పాటు అజ్ఞాతంలోని మావోయిస్టులు లొంగిపోతే వారి ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మావోయిస్టుల లొంగుబాట్లలో భాగంగా కేంద్ర హోం శాఖ చేపట్టిన కగార్ ఆపరేషన్ సత్పలితాలనిచ్చింది. మార్చి 31 వరకు విధించిన గడువుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. అయితే ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్ జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజారెడ్డిలు లొంగిపోయిన విషయం తెల్సిందే. మావోయిస్టు అగ్రనేత దేవ్ జీకి సంబంధించిన పిఎల్ జీఏ బెటాలియన్ కు చెందిన మొత్తం 130 మంది సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో దేవ్ జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డికి సంబంధించిన గన్ మెన్ లతో పాటు కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్స్ ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు సైతం ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటు సందర్భంగా వారికి పునరవాస కార్యక్రమాలతో పాటు ప్రోత్సహాకాలు అందించనున్నారు.

