నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ ప్రజల విరోచిత ఉద్యమంతో, త్యాగాలతో, బలిదానాలతో సాకారమైన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడానికి తెలంగాణ ఉద్యమ కారుల సంగం కృషి చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, మంతెన రాజేందర్ రెడ్డి కుమార్ దాస్, రాజ్ కుమార్ సుబేధార్, ఎమ్. ప్రకాష్ రెడ్డి, మధుసుధన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంగం రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన న్యాయవాది యెండల ప్రదీప్ ను జిల్లాకోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హల్ లో సన్మానించిన అనంతరం వారు ప్రసంగించారు. సకల జనుల దశాబ్దాల పోరాటం, త్యాగాలు పెనవేసుకుని పుట్టినబిడ్డనే తెలంగాణ రాష్ట్రమని వారు తెలిపారు. పన్నెండేళ్ల స్వరాష్ట్రంలో ఉద్యమకారుల ఆశయాలు కొంతమేరకు నెరవేరిన, నెరవేరాల్సినవి చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ భావజ్వాల వ్యాప్తికి ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని, మరికొందరు తమ జీవితాలనే ఆత్మర్పణ చేసుకున్నారని అన్నారు. త్యాగధనుల త్యాగాలకు కొలమానం లేదని అయిన వారి త్యాగాలకు సముచిత స్థానం ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమశక్తులను ఆదుకోవలసిన అవసరం, ఆవశ్యకత ఉన్నదని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని వారు కోరారు. ఉద్యమ కారుల ఆకాంక్షల దిశగా తన పయనం కొనసాగుతుందని యెండల ప్రదీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, రాజశేఖర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ఆశ నారాయణ, రణధీష్, సధానంద్ గౌడ్, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
