. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వోకల్ ఫర్ లోకల్ సందేశాన్ని అందరూ ఆచరణలో పెట్టాలని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “మన్ కీ బాత్” అంటే దేశ ప్రజలతో ప్రధాన మంత్రి ప్రత్యక్ష సంభాషణ వేదిక అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ అభివృద్ధి, సాంకేతిక పురోగతి, యువతలో స్ఫూర్తి, రైతుల సాధనలు, క్రీడా రంగ విజయాలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అనేక అంశాలపై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందన్నారు. ఏఐ ద్వారా జంతువులకు వైద్యం, రైతులకు, పశుసంవర్ధక రంగానికి అందుతున్న సేవలు, ప్రాచీన భారతీయ గ్రంథాలను ఆధునిక సాంకేతికతతో సంరక్షిస్తున్న విధానం దేశ గౌరవాన్ని పెంచుతోందని అభిప్రాయపడ్డారు. అవయవ దానం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించిన విషయాలను ఎమ్మెల్యే గుర్తు చేస్తూ, అవయవ దానం మహోన్నత సేవ అని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. 10 నెలల వయసు గల చిన్నారి అలిన్ చేరిన్ అబ్రహం హఠాత్తుగా మృతి చెందినప్పటికీ వారి తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, శరీన్ అబ్రహంలు ఎంతో మనోధైర్యంతో తమ కూతురి యొక్క అవయవాలను దానం చేయడం వారి మానవత్వానికి నిదర్శనమని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో ప్రస్తావించడం జరిగిందని అన్నారు. డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, కేవైసీ ప్రక్రియలను అధికారిక మార్గాల్లోనే పూర్తి చేయాలని ప్రజలకు సూచించారు. రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, జిల్లా పదాధికారులు, నాయకులు, బూత్ అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా ప్రభరి విక్రం రెడ్డి, యువ మోర్చా ప్రతినిధులు, మహిళా మోర్చా సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

