. . . 30 రోజులపాటు ఉపవాస దీక్షలు పాటించనున్న ముస్లిం ప్రజానీకం
రుద్రూర్, బతుకమ్మ :
ఆకాశంలో బుధవారం సాయంత్రం నెలవంక దర్శనంతో గురువారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయని అక్బర్ నగర్ మజీద్ సదర్ షేక్ మొహమ్మద్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా మసీదులు ప్రార్థనలకు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. నెల రోజుల పాటు ఈ దీక్షను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. సమతా, మమతల సమ్మిళ్లితాన్ని చాటి చెప్పే పవిత్రమైన పండగ రంజాన్. ఈ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించడంతో ముస్లింలు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెలరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. వేకువ జామున నాలుగు గంటలకు ఆహారం తీసుకుంటారు, దీన్ని సహార్ అంటారు. ఆ తర్వాత సూర్యాస్తమయం అయ్యేవరకు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు. సాయంత్రం ఉపవాసాన్ని ఖర్జూర ఫలంతో విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ గా పేర్కొంటారు. ముస్లింలు చేసే నమాజ్ మానసిక ప్రవర్తన తెలుస్తుంది. నిర్మల మనసుతో పాటు మానసిక, శారీరక ప్రశాంతత నేర్పుతుంది. ఇందులో భాగంగా రాత్రివేళ చేసే ఇషా నమాజ్ తర్వాత 30 రోజుల పాటు రంజాన్ మాసంలో ప్రత్యేక తరావి నమజ్ కూడా చేస్తారని షేక్ మొహమ్మద్ తెలిపారు.
