బతుకమ్మ, మద్నూర్: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రభుత్వం సోయా పంటకు క్వింటాలుకు రూ.4,892/- మద్దతు ధర ప్రకటించిందని రైతులు అందరూ సోయా బీన్ పంటను మద్నూర్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాలని కోరారు. ఎకరాకు 9 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నందున.. ఎకరాకు ఆరు క్వింటాళ్లు మాత్రమే ఉన్న కొనుగోలు నిబంధనను సడలించి పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, తాను స్వయంగా వెళ్లి సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు.

ఇది రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమని ప్రజా ప్రభుత్వంలో రైతులు అందరూ సుభిక్షంగా ఉంటారని అన్నారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్నిలబ్ది దారులకు అందించారు. అధ్యక్షులు సాయిలు, మార్కెట్ కమిటీ కార్యదర్శి రామ్ నాథ్, హనుమాన్ స్వామి, శీను పటేల్, తదితరులు పాల్గొన్నారు.

